byసూర్య | Fri, Sep 22, 2023, 07:24 PM
హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ తన కొత్త ప్లాంటుకు శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీఎస్వీకి ప్రస్తుతం మహారాష్ట్రలోని అంబర్నాథ్లో ఒక కేంద్రం ఉండగా.. జర్మనీలో ఓ ప్లాంట్ ఉంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లకు సేవలు అందిస్తోంది. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బయో ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటి. ఇప్పటికి 50 సంవత్సరాలుగా..భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ తన శాస్త్రీయ వనరులను అనేక రకాల జీవసంబంధమైన, బయోటెక్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఉపయోగించింది.
ప్రస్తుతం.. మహిళల ఆరోగ్య సంరక్షణతో పాటు ఐయూఐ-ఐవీఎఫ్ చికిత్సా రంగాలలో విశిష్ట సేవలను అందిస్తోంది. ముంబయిలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ భారతదేశంలోని టాప్ 10 బయోటెక్ కంపెనీలలో ఒకటిగా పేరొందింది. కంపెనీ పోర్ట్ఫోలియోలో 145 బ్రాండ్లు ఉండటం గమనార్హం. కంపెనీలో 2500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వారి బ్రాండ్లు భారతదేశం అంతటా విక్రయించబడుతుండగా.. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
జీనోమ్ వ్యాలీలో 10 ఎకరాల విస్తీర్ణంలో కొత్త తయారీ కేంద్రాన్ని 200 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలను అందించడంతో పాటు సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తయారీ కేంద్రంతో, భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ ఒకటో దశలో ఫిల్- ఫినిష్ ఫార్ములేషన్ లైన్, ప్రాజెక్ట్ రెండో దశలో అదనపు బహుళ-ఉత్పత్తి లైన్ను ప్రారంభించడం ద్వారా ఇంజెక్షన్లను ఉత్పత్తి చేయడంలో దాని సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.