byసూర్య | Fri, Sep 22, 2023, 07:20 PM
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. ఒక పార్టీపై ఇంకో పార్టీ ఆరోపణలు, విమర్శలు గుప్పించటం సర్వసాధారణం. కానీ.. ఈసారి మాత్రం ఆయా పార్టీల్లో సొంత పార్టీల నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. అసమ్మతులతో ప్రధాన పార్టీల సమీకరణాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తమకు పడని వారు తమపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న వాదన తరచూ.. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వినిపించేది. కానీ.. ఈసారి బీజేపీ నుంచి కూడా ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఈటల రాజేందర్ విషయంలో ఈ వాదన వినిపించగా.. ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రాములమ్మ విజయశాంతి నుంచి వినిపిస్తోంది.
రాములమ్మ బీజేపీకి దూరమవుతున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో జరుగుతున్న ప్రచారాన్ని జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఖండించారు. అయితే.. ఈ విషయాన్ని చాలా రోజులుగా ఖండిస్తూ వస్తున్న విజయశాంతి.. ఈసారి మాత్రం తమ సొంత పార్టీ నేతలపైనే నిప్పులు కక్కేసింది. కొంతమంది నేతలు పనిగట్టుకుని మరీ.. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాములమ్మ ట్వీట్ చేసింది. అయితే.. తనకు చిట్ చాట్ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో కార్యాచరణ చేపట్టే అలవాటు తనకు లేదని విజయశాంతి చెప్పుకొచ్చారు. పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను.. ప్రధాన నాయకులకు ఈ నెల 16 తేదీన ముఖ్య సమావేశంలో తాను స్పష్టంగా తెలియచేసినట్టు చెప్పుకొచ్చారు. ఆ విషయాలు బయటకు లీకేజ్ల పేరుతో ఇచ్చేందుకు తాను వ్యతిరేకినని చెప్పుకొచ్చారు. ఇదంతా తెలిసి కూడా కొంతమంది తమ పార్టీలోని నేతలు పనిగట్టుకుని బీజేపీకి రాములమ్మ దూరం అంటూ తనపై సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని.. అది కచ్చితంగా ఖండించదగ్గదని తెలిపారు.