![]() |
![]() |
byసూర్య | Fri, Mar 31, 2023, 10:03 PM
చట్టంతనపని తాను చేసుకొనిపోతుంది. నేరం చేస్తే ఎంతటి వారినైనా చట్టం చేతిలో శిక్ష తప్పదు. అందుకు చాలా ఘటనలే నిదర్శనంగా నిలిచాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులైనా సరే.. చట్టానికి అతీతులు కాదు.. అంతేందుకు ఆ చట్టాన్ని అమలు చేస్తున్న పోలీసులు కూడా తప్పు చేస్తే శిక్ష అనుభవించకతప్పదు. ఇప్పుడు హైదరాబాద్లోనూ అదే జరిగింది. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఎస్సైకి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. అబిడ్స్ పోలీస్స్టేషన్లో ఎస్సైగా పని చేసిన ఆవుల ప్రసాద్ అనే పోలీసు లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో అనిశా ప్రత్యేక న్యాయస్థానం రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధించింది.
ఓ కేసులో నిందితుడైన మాదవరెడ్డి అనే వ్యక్తికి 354 సెక్షన్ కింద కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎస్సై ఆవుల ప్రసాద్ 20 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. లంచం స్వీకరిస్తుండగా అనిశా అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన 2013లో జరిగింది. కేసు నమోదు చేసిన అనిశా అధికారులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అన్ని ఆధారాలు పరిశీలించిన అనంతరం న్యాయస్థానం ఎస్సైకి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
మరోవైపు.. శంకర్పల్లి సీఐ మహేష్ గౌడ్పై బదిలీ వేటు పడింది. సీఐ మహేష్ గౌడ్.. ఓ మహిళా కానిస్టేబుల్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా పలు అవినీతి పనులు చేసినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. విషయం తెలుసుకున్న వెంటనే సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సీరియస్ అయ్యాడు. సీఐ పైన వచ్చిన.. లైంగిక వేధింపుల ఆరోపణలతో పాటు అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. లోతుగా దర్యాప్తు జరిపిన అనంతరం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.. సీఐ మహేష్ గౌడ్ను వెంటనే శంకర్పల్లి నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.