byసూర్య | Fri, Sep 23, 2022, 12:35 PM
రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా ప్రగతిని సాధిస్తున్నందున గ్రామీణ సహకార సంస్థలు తమ వ్యాపార లావాదేవీలను అదే స్థాయిలో మెరుగు పర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించారు. గురువారం బిఆర్కెఆర్ భవన్లో కో-ఆపరేటివ్ క్రెడిట్ సంస్థల ఆర్థిక పరిపుష్టి పర్యవేక్షణపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సోమేశ్కుమార్ అధ్యక్షత వహించి రాష్ట్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకుల పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా పురోగతిని సాధిస్తున్నందున సహకార సంస్థలు తమ వ్యాపార లాభాలలను పెంచుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. సహకార బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో బ్యాంకర్లు మరిన్ని వినూత్న విషయాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. తెలంగాణా కేంద్ర వ్యవసాయ సహకార బ్యాంకు మొత్తం వ్యాపార లావాదేవీలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 22. 8 శాతం ఎక్కువగా ఉందని గతేడాది రూ. 13, 245 కోట్ల వ్యాపారం కాగా ఈ ఏడాది రూ. 16, 276. 71 కోట్లకు చేరిందన్నారు.
2021-22 సంవత్సరంలో టిఎస్సిఎబి షేర్ క్యాపిటల్లో 25. 41 శాతం వృద్ధి ఉంది. నిల్వలు 2020-21లో రూ. 556. 53 కోట్ల నుంచి 2021-22లో రూ. 615 కోట్లకు పెరిగాయి, ఇది 10. 6 4 శాతం వృద్ధి. 2020-21లో డిపాజిట్లు రూ. 5466. 41 కోట్ల నుంచి రూ. 6941. 95 కోట్లకు పెరిగాయి, ఇది 26. 99 శాతం వృద్ధి. రుణాలు 15. 67 శాతం పెరిగి రూ. 6261. 80 కోట్లకు చేరుకోగా, పెట్టుబడులు 40. 27 శాతం పెరిగి రూ. 2058. 52 కోట్లకు చేరాయని వెల్లడించారు.
టిఎస్సిఎబి నిర్వహణ లాభం 2022 మార్చి 31 నాటికి రూ. 100. 89 కోట్లుగా ఉందన్నారు. గత సంవత్సరం లాభం రూ. 59. 38 కోట్లతో పోలిస్తే 69. 90 శాతం పెరిగిందన్నారు. నికర లాభం 66. 82 శాతం పెరిగి రూ. 77. 29 కోట్లుగా ఉంది. దేశంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి ఎం. రఘునందన్రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి టి. కె. శ్రీదేవి, సహకార శాఖ కమిషనర్ ఎం. వీరబ్రహ్మయ్య, టిఎస్సిఎబి చైర్మన్ కొండూరు రవీందర్రావు, టిఎస్సిఎబి ఎండి నేతి మురళీధర్, ఆర్బిఐ రీజినల్ డైరెక్టర్ కె. నిఖిల, నాబార్డ్ సిజిఎం సుశీల చింతల, నాబార్డు జిఎం వై. హరగోపాల్, అధికారులు పాల్గొన్నారు.