byసూర్య | Fri, Aug 05, 2022, 01:01 PM
నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి శివారులో గురువారం రాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బైకుపై వెళ్తున్న లింగస్వామి (32) అనే వ్యక్తి పై దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. భాదితుడికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని స్థానికులు నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మూడు రౌండ్ల బుల్లెట్లు దొరికాయి. భాదితుడు నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెళ్ళెంల గ్రామానికి చెందిన లింగస్వామి అని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి మునుగోడులో కూల్ డ్రింక్స్, నీళ్ళ బాటిల్స్ విక్రయిస్తాడని అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని తెలిపారు.
రోజు మాదిరిగానే రాత్రి షాప్ మూసివేసి బైకుపై ఇంటికి వస్తున్న సమయంలో మునుగోడు మండలం ఊకొండి శివారులో గుర్తుతెలియని వ్యక్తులు తుపాకితో కాల్పులు జరిపి లింగస్వామి చనిపోయాడని భావించి అక్కడ నుండి పరారయ్యారు. కాల్పుల శబ్దం విన్న స్వామి అనే యువకుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న లింగస్వామిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నల్గొండ డి. ఎస్. పి నరసింహారెడ్డి ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నాడు. దుండగుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి తో పాటు మరికొందరిపై అనుమానం ఉందని బాధితుడు పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.