byసూర్య | Wed, Jun 22, 2022, 09:32 PM
తెలంగాణ మరో శ్రీలంకలా మారబోతోంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చే చేశారు అని బీజేపీ మహిళా నేత విజయశాంతి అన్నారు. ఏ నెలకానెల అప్పు పుడితేనే జీతాలు, పింఛన్లు. కొత్త అప్పు తేనిదే ఒక్క రోజు కూడా గడిచే పరిస్థితి లేదు. స్కీములకు చిల్లిగవ్వ లేదు అని ఆమె అన్నారు.పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు లేవు. మొత్తం మీద 3 నెలలుగా రాష్ట్ర ఖజానా నుంచి పైసా తీయడం లేదు. అప్పు వస్తేనే నిధులు సర్దుబాటవుతాయని... అప్పటిదాకా పైసలు ఇవ్వలేమని వివిధ శాఖలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తేల్చి చెబుతున్నది అని తెలిపారు.
మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన బాండ్ల వేలంపాటలోనూ తెలంగాణకు చోటు దక్కలేదు. దీంతో పథకాలకు నిధులు ఎట్లా ఇవ్వాలా... అని ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నరు. గడిచిన రెండున్నర నెలల్లోనే వివిధ స్కీముల కింద లబ్ధిదారులకు చేరాల్సినవి రూ.15 వేల కోట్లు అందాల్సి ఉండగా, సీఎం కేసీఆర్ సర్కారు మాత్రం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో)లు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది.ఇలా తెలంగాణను కుటుంబపాలనతో మరో శ్రీలంకలా మార్చేస్తున్నరు అని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ కుటుంబ పాలన అంతం కావాలని, తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ అండ్ కో త్వరలో ఫామ్హౌస్లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవడం ఖాయం అని విజయశాంతి తెలిపారు.