byసూర్య | Wed, Jan 12, 2022, 09:25 AM
బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. అక్రమార్కులు పలు మార్గాల్లో బంగారాన్ని ఇతర దేశాల నుంచి భారత్కు తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు.తాజాగా శంషాబాద్ విమనాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మగ్గురు మహిళల నుంచి 1.48 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనుమానం వచ్చి ముగ్గురు మహిళలను తనిఖీలు చేయగా.. వారిలో ఇద్దరు మహిళల లోదుస్తుల్లో బంగారం బయటపడినట్లు అధికారులు తెలిపారు. మరో మహిళ నుంచి కూడా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.72.80 లక్షల విలువ ఉంటుందని పేర్కొన్నారు. దుబాయ్ నుంచి వేర్వేరు ఫ్లైట్ల ద్వారా వచ్చిన మహిళలు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని ఎవ్వరికి అనుమానం రాకుండా లోదుస్తుల్లో దాచి తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చి తనిఖీలు చేశామని.. దీంతో పెద్ద ఎత్తున బంగారం బయటపడినట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.