byసూర్య | Tue, Jun 08, 2021, 02:34 PM
టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన తర్వాత తన సొంత హుజూరాబాద్ నియోజక వర్గంలో తొలిసారి పర్యటిస్తున్న ఈటల రాజేందర్.. శంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 'నా నియోజక వర్గ ప్రజలు నాతో చెప్పారు.. నాకు అన్యాయం జరిగిందని అన్నారు. 19 ఏళ్ల పాటు గులాబీ జెండాను, తెలంగాణ ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటే తెలంగాణ ద్రోహులను పక్కకు పెట్టుకుని, కష్టకాలంలో అండగా ఉన్న నాలాంటి వారికి కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని చెప్పారు. రాబోయే కాలంలో నా రాజీనామా అనంతరం వచ్చే ఉప ఎన్నికలో కేసీఆర్కు బుద్ధి చెప్పి తీరుతామన్నారు' అని ఈటల అన్నారు.
'తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువైతే ఆ కరీంనగర్ను కాపాడుకున్న ప్రాంతం హుజురాబాద్. సంపూర్ణ మద్దతు నాకే ఇస్తామని ప్రజలు చెప్పారు. కేసీఆర్ విజయం సాధించే అవకాశం లేదని చెప్పారు. ఈ నియోజక వర్గంలో జరిగే సంగ్రామం కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలా ఉంటుంది' అని ఈటల పేర్కొన్నారు. 'తెలంగాణలో ఉద్యమంలో పాల్గొని ఈ రోజు భంగపడ్డ వారంతా రేపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో యువత, నిరుద్యోగులు, ప్రైవేటు కార్మికులు, హక్కుల కోసం ఉద్యమిస్తోన్న వారు నన్ను ఆశీర్వదించారు. నాకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు' అని ఈటల అన్నారు.
ప్రగతి భవన్ కేంద్రంగా స్క్రిప్టులు రాసి ఇస్తే కొందరు నాపై మీడియా ముందు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను అంటే ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారే నష్టపోతారు తప్ప నాకేం జరగదు' అని ఈటల చెప్పారు. తన రాజీనామా తర్వాత వచ్చే ఎన్నికలో కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారని ఈటల అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓటర్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.