byసూర్య | Thu, Jun 03, 2021, 03:45 PM
ఈ నెల 8న మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు సన్నాహకాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్కు శుక్రవారం ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరుతోంది. రాజీనామా కంటే ముందే ఈటలను సస్పెండ్ చేసే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక అనుచరులతో ఈటల సమాలోచనలు చేస్తారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ ఉమ బీజేపీలో చేరుతున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అయిన ఈటల రాజేందర్ గురువారం హైదరాబాద్ రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత నెల 30న ఏనుగు రవీందర్రెడ్డితో కలిసి ఈటల ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. తమ పార్టీ నియమావళి ప్రకారం, ఏ నాయకుడైనా పదవికి రాజీనామా చేసిన తర్వాతే చేరాల్సి ఉంటుందని బీజేపీ నేత బండి సంజయ్ చెప్పారు. ఈటల రాజేందర్ సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేరుతారని ఆయన స్పష్టం చేశారు.