byసూర్య | Fri, Oct 09, 2020, 12:43 PM
తెలంగాణ కేబినెట్ శనివారం సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కేబినెట్లో చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో రైతులు సాగు చేసిన పంటను యాసంగి కాలానికి ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఇప్పుడు వార్షాకాలం సాగు చేసిన పంటలు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఐదువేలకుపైగా కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల్లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ యాసంగిలో ఏ పంట వేస్తే లాభం అనేటివంటి అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ శనివారం ఉదయం సమీక్ష సమీవేశం నిర్వహించనున్నారు. అనంతరం కేబినెట్ సమావేశం జరుగుతుంది.
ఈ భేటీలో ప్రధానంగా వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటసాగు విధానం.. అలాగే ధాన్యం కొనుగోలుపై ఈ కేబినెట్లో చర్చించనున్నారు. మరోవైపు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ యాక్టు కూడా సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఈ నెల 13న అసెంబ్లీ, 14న శాసనమండలి సమావేశం నిర్వహించబోతోంది. దీనిపై కూడా రేపు కేబినెట్లో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. హైకోర్టు సూచనల మేరకు మరికొన్ని బిల్లులను కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది.