byసూర్య | Fri, Jan 10, 2020, 07:23 PM
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయం అసన్నమైంది. కేటీఆర్ త్వరలో సీఎం కానున్నట్లు ఇటీవల కాలంలో జోరుగా ప్రచారం సాగుతున్నది. పత్రికల్లో వరుస కథనాలు కూడా వస్తున్నాయి. జనవరిలో కేటీఆర్ కు పట్టాభిషేకం జరగనున్నట్లు కూడా కొన్ని పత్రికలు ప్రకటించాయి. కొంతమంది మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎం బాధ్యతలను అప్పగిస్తారని చెబుతున్నారు. అందరూ ఊహించినట్లుగానే కేటీఆర్ కు త్వరలో పట్టాభిషేకం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జనవరిలో కాకుండా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పుట్టిన రోజున (ఫిబ్రవరి 17న) కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక తాను బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కేసీఆర్ తన అత్యంత సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఏదైనా మంచి నిర్ణయం తీసుకునే ముందు కేసీఆర్ ముహుర్తాలు చూడడం అలవాటు. కానీ కేటీఆర్ ను సీఎం చేసేందుకు తన పుట్టిన రోజే సరైనా ముహుర్తమని కేసీఆర్ నమ్ముతున్నట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 17న కేటీఆర్ కు పట్టాభిషేకం ఖాయమని తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా కేటీఆర్ కు సీఎం పదవి అప్పగించడంపై కేసీఆర్ కు ఇంటి పోరు తప్పదని తెలుస్తుంది. కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలైనప్పటి నుంచి ఆమె ఎలాంటి పదవి లేకుండా ఖాళీగా ఉంది. దీంతో కేటీఆర్ కు సీఎం పదవి ఇస్తే తనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వాలని కేసీఆర్ పై కవిత ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కానీ కేసీఆర్ కు ఇష్టం లేదని, రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ పగ్గాలు తన చేతుల్లోనే పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. మరో ముఖ్యనేత హరీష్ రావును ఇప్పటికే కేసీఆర్ దూరం పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా దూరంగా ఉంచారు. ఎలాంటి కార్యక్రమాల్లోగానీ, నిర్ణయాత్మక విషయాల్లోనూ ఆయనను పిలువడం లేదు. దీంతో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యవహారాలు కాకుండా కేవలం తన నియోజకవర్గ వ్యవహారాలకే హరీష్ రావు పరిమితమయ్యారు. దీంతో హరీష్ రావు నుంచి ఇప్పటికిప్పుడు ఎలాంటి ముప్పు లేదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ బాగోగులు చూస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రభావమేమి ఉండదు. కేసీఆర్ ఏది చెబితే దానికి ఎదురు చెప్పే పరిస్థితి లేదు. దీంతో కవితను కొంత శాంత పర్చితే కేటీఆర్ పాలన సజావుగా సాగనున్నది.
కేటీఆర్ ను సీఎం చేసిన తర్వాత తెలంగాణ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ కేసీఆర్ వ్యవహరిస్తారని పలు కథనాలు వచ్చాయి. కానీ దానిపై కేసీఆర్ కు పెద్దగా ఆసక్తి లేదని తెలిసింది. ఒకవేళ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తే కేటీఆర్ స్వతంత్రంగా వ్యవహరించడం కష్టమౌతుందని, దానివల్ల పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో కేటీఆర్ కు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ప్రత్యామ్నాయ సీఎంగా చెలామణి అవుతున్న విషయం తెలిసిందే. దీంతో పాలన పరంగా కేటీఆర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని పలువురు భావిస్తున్నారు.