byసూర్య | Mon, Oct 14, 2019, 09:37 PM
7 సంవత్సరాల క్రితం సచివాలయంలో నిర్మించిన భవనాలను కూడా కూల్చివేస్తున్నారని, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కొనసాగిన సచివాలయంలో ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారో అర్థం కావడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టుకు విన్నవించారు. సచివాలయం భవనాల కూల్చివేత పిటిషన్ పై ఇవ్వాళ హైకోర్టు లో విచారణ జరిగింది. సచివాలయంలో ఉన్న భవనాల కూల్చివేత కు సంబంధించి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించగా, పిటిషనర్ తరపు చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. నూతన సచివాలయ నిర్మాణం వలన వందల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్నాయని పిటీషనర్ తరపు న్యాయవాది వివరించారు. సచివాలయంలో నిర్మాణం పై క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, నూతన సచివాలయం నిర్మాణం, పాత భవనాల కూల్చివేత పై ఇప్పటికే కమిటీని వేశామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ వివరించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవని, సరైన పార్కింగ్ కూడా లేదని కోర్టు కు తెలిపారు. పాత భవనాలపై కమిటీ ఇచ్చిన రిపోర్టు ను కోర్టుకు సమర్పించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.