byసూర్య | Tue, Jan 22, 2019, 09:40 AM
చార్మినార్: పాతబస్తీ రూపురేఖలు మారిపోతున్నాయి. మెట్రో పనులు చకచకా సాగుతున్నాయి. రేయింబవళ్లు సిబ్బంది పనులు చేస్తున్నారు. ఈ మార్గం పూర్తయితే జూబ్లీ బస్టాండ్ నుంచి ప్రారంభమవుతూ సీబీఎస్ మీదుగా ఫలక్నుమా వరకు మెట్రో ప్రయాణం సాగుతుంది. ఇప్పటికే జూబ్లీ బస్స్టేషన్ నుంచి సీబీఎస్ వరకు మెట్రో పనులు పూర్తికావచ్చాయి. కేవలం ఆ మార్గంలో ఎలక్ట్రికల్ పనులు మొదలు పెట్టాల్సి ఉన్నది. కీలకమైన కోఠి మెడికల్ కాలేజీ జంక్షన్ పనులు సైతం పూర్తికావడంతో పాతబస్తీలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. సీబీఎస్ నుంచి దారుల్షిఫా వరకు పిల్లర్ల నిర్మాణ ప్రక్రియ చేపట్టారు. సీబీఎస్ నుంచి మూసీమార్గం మీదుగా దారుల్షిఫా మార్గంలో కొన్ని చోట్ల పిల్లర్లూ పూర్తయ్యాయి. దారుల్షిఫా నుంచి ఫలక్నుమా వరకు మెట్రో సాగనున్న మార్గల్లో ఆస్తులను కోల్పోతున్న వారిని ఇప్పటికే గుర్తించారు.