byసూర్య | Sat, Jan 19, 2019, 11:44 AM
కౌలలాంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో ఏడో సీడ్ సైనా 21-18, 23-21తో రెండో సీడ్, ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది.
8 నిమిషాల పాటు సాగిన పోరులో సైనా అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. తొలి గేమ్లో 8-15తో వెనుకబడిన సైనా.. ఆ తర్వాత ఒక్కో పాయింటే గెలుస్తూ ఒకుహరను సమీపించి 17-16తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. కొద్దిసేపటికే 21-18తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది.
ఇక, రెండో గేమ్ను ఆధిక్యంతో ప్రారంభించిన సైనా.. ఒకానొక దశలో వెనుకబడింది. 14-14 స్కోరు వద్ద ఒకుహర వరుసగా 4 పాయింట్లు గెలిచి 18-14తో ఆధిక్యంలోకి వెళ్లింది. సైనా వెనుకబడినా పట్టుదల కోల్పోకుండా 19 పాయింట్ల వద్ద ఒకుహరను అందుకుంది. పాయింట్లు సమమవుతూ వెళ్లడంతో గేమ్ ఉత్కంఠగా మారింది.20, 21 స్కోర్ల వద్ద ప్రత్యర్థికి లభించిన 2 గేమ్ పాయింట్లను సైనా కాపాడుకుంది. వరుసగా 2 పాయింట్లు సాధించి 23-21తో రెండో గేమ్, మ్యాచ్ను కైవసం చేసుకుంది. శనివారం జరిగే సెమీస్లో నాలుగో సీడ్ కరోలినా మారీన్ (స్పెయిన్)తో సైనా తలపడుతుంది. ముఖాముఖీ రికార్డులో ఇద్దరు 5-5తో సమంగా ఉన్నారు.
మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్ 23-21, 16-21, 17-21తో నాలుగో సీడ్ సాన్ వాన్ (కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.