by సూర్య | Sat, Oct 23, 2021, 03:30 PM
బాలీవుడ్ నటి కంగన రనౌత్పై పాటల రచయిత జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ జరుపుతున్న అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగానే వ్యవహరించారని అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు చెప్పింది. ఈ పిటిషన్పై విచారణను వేరొక కోర్టుకు బదిలీ చేయాలని కంగన దాఖలు చేసిన దరఖాస్తును తోసిపుచ్చింది.
కంగన దరఖాస్తును తోసిపుచ్చుతూ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్టీ దండే గురువారం తీర్పు చెప్పారు. ఈ ఆదేశాలు శనివారం పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. కంగనపై జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ జరుపుతున్న అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగా, వివేకంతో వ్యవహరించారని దండే తెలిపారు. కంగనకు వ్యతిరేంగా ఎటువంటి పక్షపాతం ప్రదర్శించలేదన్నారు. చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించినంత మాత్రానికి కంగనకు వ్యతిరేకంగా ఉన్నట్లు కాదని చెప్పారు.
కంగన దాఖలు చేసిన దరఖాస్తులో, తనకు అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుపై నమ్మకం పోయిందని తెలిపారు. బెయిలు మంజూరు చేయదగిన నేరానికి సంబంధించిన కేసులో కోర్టుకు హాజరుకాకపోతే తనకు వారంట్ జారీ చేస్తామని పరోక్షంగా ఈ కోర్టు బెదిరించిందని ఆరోపించారు. ఈ కోర్టు తనకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.
దీనిపై దండే స్పందిస్తూ, అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కంగనకు న్యాయమైన అవకాశాలు ఇచ్చిందన్నారు. కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు కోరిన దరఖాస్తులన్నిటికీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఆదేశాలన్నిటినీ తాను పరిశీలించానని తెలిపారు. ఈ ఆదేశాలన్నీ వివేకంతో కూడుకున్నవేనని చెప్పారు. అంధేరీ కోర్టు జారీ చేసిన ఆదేశాలను సెషన్స్ కోర్టు ధ్రువీకరించిందన్నారు. కేవలం సంశయం కారణంగా కేసును ఒక కోర్టు నుంచి వేరొక కోర్టుకు బదిలీ చేయడం సాధ్యం కాదని తెలిపారు.
జావేద్ అక్తర్ గత ఏడాది నవంబరులో దాఖలు చేసిన పిటిషన్లో, కంగన రనౌత్ ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించాయని ఆరోపించారు. బాలీవుడ్లో కోటరీని ప్రస్తావిస్తూ, తన పేరును అనవసరంగా ప్రస్తావించారని తెలిపారు. దీంతో అక్తర్పై కంగన కూడా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తనను ఆయన నేరపూరితంగా బెదిరించారని, డబ్బు గుంజేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
Latest News