by సూర్య | Fri, Apr 09, 2021, 01:09 PM
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘అన్నాత్త’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తైన తర్వాత రజినీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్లో అన్నాత్త షూటింగ్ సమయంలో రజినీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తన ఆలోచనను విరమించుకున్న రజినీ గతకొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడు ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రజినీ మళ్లీ సినిమా షూటింగ్లో బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 75 శాతం పూర్తయిన ‘అన్నాత్త’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసే పనిలో పడ్డ రజినీ.. తాజాగా గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం సాయంత్రం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే రజినీ షూటింగ్లో పాల్గొనే సమయంలో పూర్తి పటిష్ట ఏర్పాట్లు చేశారని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో షూటింగ్ జరపనున్నట్లు తెలుస్తోంది. తమ అభిమాన హీరో మళ్లీ షూటింగ్లో పాల్గొంటుండడంతో రజినీ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉంటే సన్ పిక్చర్స్ రూపొందిస్తున్న అన్నాత్త చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్, మీనా, కుష్బూ తారాగణం నటిస్తున్నారు.
Latest News