శరవేగంగా నేషనల్ హైవే పనులు.. ఇక ఆ రూట్‌లో ప్రయాణించేవారికి నో టెన్షన్

byసూర్య | Fri, Oct 25, 2024, 07:05 PM

కేంద్ర ప్రభుత్వం భారత మాల యోజన కింద.. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిని పునర్నిర్మాణం చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న రోడ్డును ఫోర్ లైన్ రోడ్డుగా విస్తరిస్తున్నారు. 68 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కరీంనగర్‌-వరంగల్‌ నేషనల్ హైవే(ఎన్‌హెచ్‌-563) నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,146 కోట్లు కేటాయించింది. ఇక ఈ ఎన్‌హెచ్‌-563 కోసం ఇప్పటికే 325.125 హెక్టార్ల భూమిని సేకరించారు. కరీంనగర్‌ మండలం ఇరుకుల్ల, దుర్శేడ్‌ శివారులో బొమ్మకల్‌ మానేరు వాగు మీదుగా మానకొండూర్‌ వరకు రహదారి పనులు విస్తృతంగా జరుగుతున్నాయి.


ఇక ఈ ఎన్‌హెచ్‌-563 నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 28 వెహికిల్‌ అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. అదే విధంగా ఇరుకుల్ల, మానేరు సహా పలు వాగులపై మొత్తం 9 మేజర్‌ వంతెనలను కట్టనున్నారు. బొమ్మకల్‌ మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరుకుల్ల వాగుపై 250 మీటర్లు.. మానేరు వాగుపై 562 మీటర్ల పొడవుతో బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇరుకుల్ల గ్రామ ప్రధాన రహదారిపై ఫై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనాలను మళ్లించేందుకు తాత్కాలికంగా రోడ్డును సిద్ధం చేస్తున్నారు.


ఇక ఈ కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి నిర్మాణానికి 2 ఏళ్ల క్రితమే అధికారులు భూసేకరణ చేపట్టారు. అయితే ప్రస్తుతం నేషనల్ హైవే పనులు జరుగుతున్నా తమకు ఇంకా పరిహారం అందించడం లేదని స్థానికంగా ఉన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ మండలంలోని భూసేకరణ చేసిన గ్రామాల్లో దుర్శేడ్‌, ఇరుకుల్ల, ఎలబోతారం, నగునూర్‌, జూబ్లీనగర్‌ గ్రామాల్లోని రైతుల నుంచి వారు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను ఈ జాతీయ రహదారి కోసం సేకరించారు.


ఇరుకుల్లలో పూర్తిస్థాయిలో పరిహారం అందించినప్పటికీ.. రహదారి నిర్మాణంలో భాగంగా కోల్పోయిన బావులకు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని స్థానికులు వాపోతున్నారు. ఇక ఎలబోతారం, నగునూర్‌, జూబ్లీనగర్‌ గ్రామాల్లో కొంతమంది నుంచి 15 రోజుల క్రితం సంతకాలు తీసుకున్న అధికారులు ఇప్పటికీ డబ్బులు వేయలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరుకుల్ల నుంచి ఎలబోతారం, జూబ్లీనగర్‌కు రహదారి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతే చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.


Latest News
 

*మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి* Sat, Oct 26, 2024, 03:23 PM
కేటీఆర్ తీరు పై మండ్డిపడ్డ కాంగ్రెస్ నాయకులు Sat, Oct 26, 2024, 03:18 PM
గాయత్రి విద్యానికేతన్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ Sat, Oct 26, 2024, 03:15 PM
కోదండ రెడ్డిని కలిసిన చెవిటి వెంకన్న యాదవ్ Sat, Oct 26, 2024, 03:15 PM
వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే Sat, Oct 26, 2024, 03:13 PM