byసూర్య | Sat, Oct 26, 2024, 03:15 PM
అంతర్జాతీయ చిత్ర కళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ని గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు స్వయంగా గీసిన పలు రకాల డ్రాయింగ్స్, పెయింటింగ్స్, దేవతా మూర్తుల చిత్రాలు, సైన్స్ సంబంధిత చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కాళోజీ చిత్రం, అర్థనారీశ్వరుని చిత్రం, రైతు, గుండె, మిక్కీ మౌస్ తదితర చిత్రాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినీ విద్యార్థులు, పోషకులు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ని సందర్శించి పిల్లల్లో దాగిన చిత్రకళా నైపుణ్యాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక కళ అంతర్గతంగా దాగి ఉంటుందనీ, దానిని బాల్యంలోనే గుర్తించి, వారికి ఆయా కళల్లో శిక్షణ ఇప్పించినట్లయితే వారు భవిష్యత్ లో గొప్ప పేరు సాధించే అవకాశం ఉందన్నారు.
అందుకనే ఈ రోజు అంతర్జాతీయ చిత్ర కళా దినోత్సవం అనే ప్రత్యేక సందర్భాన్ని అవకాశంగా తీసుకొని పిల్లలలో అంతర్గతంగా దాగి ఉన్న చిత్ర కళా నైపుణ్యాలను అందరికీ తెలిసేలా ప్రదర్శించాలనే ఆలోచనతో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మేము ఊహించిన దాని కన్నా ఎక్కువ సంఖ్యలో పిల్లలు తమ తమ చిత్రాలను తీసుకొని రావడం ఆనందం కలిగించిందని, చిన్న వయసులోనే అద్భుతమైన చిత్రాలను గీసిన విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. మా పాఠశాల యాజమాన్యం ఎప్పుడు కూడా కేవలం విద్యార్థుల యొక్క చదువు పైనే శ్రద్ధ పెట్టకుండా, వారిలో దాగిన ఇలాంటి నైపుణ్యాలను మెరుగుపరిచే కార్యక్రమాలను కూడా ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.