కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అరెస్ట్.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తం

byసూర్య | Sat, Oct 19, 2024, 07:10 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాద్‌లోని అటు అశోక్ నగర్‌లో, ఇటు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు యువత నుంచే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీల నేతల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. గ్రూప్-1 అభ్యర్థులకు అండగా.. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్రం మంత్రి బండి సంజయ్ కూడా గ్రూప్-1 అభ్యర్థులకు అండగా నిలిచారు. అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలో బండి సంజయ్ పాల్గొన్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వెంటనే రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ.. చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు బండి సంజయ్.


ఈ క్రమంలోనే.. మోహన్‌నగర్‌లోని గ్రూప్-1 అభ్యర్థులను బండి సంజయ్ పరామర్శించారు. భారీ ఎత్తున చేరుకున్న విద్యార్థులతో చలో సెక్రటేరియట్‌కు యువతతో కలిసి బండి సంజయ్ బయలుదేరగా.. అప్రమత్తమైన పోలీసులు బండి సంజయ్ కారును అడ్డుకున్నారు. సంజయ్ ర్యాలీని ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. దీంతో.. పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా సచివాలయం వెళ్లి తీరుతానని బండి సంజయ్ పోలీసులకు సవాల్ విసిరారు. మరోవైపు గ్రూప్-1 అభ్యర్థులంతా ఏకమై "పోలీసులు గో‌‌బ్యాక్" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.


ఇందిరా పార్క్ వద్దకు పెద్ద ఎత్తున యువత చేరుకోవడంతో రోడ్లన్ని పూర్తిగా బ్లాక్ అయ్యాయి. ఈ సందర్భంగా.. బండి సంజయ్ తన వాహనంపైకి ఎక్కి.. జీవో నెంబర్ 29ని రద్దు చేయాలంటూ ఫ్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ జీవోను రద్దు చేయాలని హైకోర్టులో ఇప్పటికే 20 పిటిషన్లు దాఖలు అయ్యాయని బండి సంజయ్ గుర్తు చేశారు. కోర్టును కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలని సూచించారు.


ప్రభుత్వం మొండిపట్టు వీడాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయదలచుకుందా.. అని ప్రశ్నించారు. రేవంత్ పాలన నిజాం రాజును తలపిస్తోందని కామెంట్ చేశారు. ఇప్పటికైనా గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం మొండి పట్టు వీడి.. జీవో నెం.29 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటం సరికాదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల సమస్యలను సీఎం రేవంత్‌ రెడ్డికి చెప్పేందుకే తాను అభ్యర్థులతో కలిసి సచివాలయానికి వెళ్తున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనాల్లో బండి సంజయ్‌ని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌కి సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. జీవో నెం.29పై చర్చకు రావాలని ఆహ్వానించినట్టు సమాచారం.


ఇదిలా ఉంటే.. మరోవైపు గ్రూప్-1 అభ్యర్థుల ర్యాలీలో బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్ తదితల నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనటంతో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో.. అభ్యర్థుల ర్యాలీ కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది.


అభ్యర్థుల ర్యాలీలను ఎక్కడికక్కడ అడ్డగించే ప్రయత్నం చేసినా.. యువత, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ వద్దకు చేసుకున్నారు. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు పెద్ద ఎత్తున సెక్రటెరియట్ వద్ద మోహరించారు. భారీకేడ్లు ఏర్పాటు చేసి.. ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరుకోవటంతో.. వాళ్లందరినీ చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురిని అరెస్ట్ చేసి.. వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో.. సెక్రెటేరియట్ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM