byసూర్య | Fri, Oct 18, 2024, 02:23 PM
ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆది కవి వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బోయవాడిగా జీవితం గడిపిన వాల్మీకి నారద మహర్షి దివ్య ఉపదేశంతో ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామాయణ మహా గ్రంధాన్ని 24 వేల శ్లోకాలతో ఆది కావ్యంగా పూర్తి చేసిన గొప్ప వ్యక్తి శ్రీ మహర్షి వాల్మీకి అని పేర్కొన్నారు.
మనుషుల్లో మంచి మార్పు వస్తే గొప్ప వారీగా ఎదగడంలో శ్రీవాల్మీకి మహర్షి మనందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. మన చరిత్రను మలుపు తిప్పిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అనేదానికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతులుగా జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, బిసి వెల్ఫేర్ అధికారి రాజమనోహర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి రాంరెడ్డి, సూపరిండెంట్లు,కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.