byసూర్య | Wed, Oct 16, 2024, 08:39 PM
తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్ ఐఏఎస్ల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 16వ తేదీలోపు ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు ఇవ్వగా.. ఈరోజే గడువు ముగుస్తుండటంతో ఆమ్రపాలి సహా నలుగురు ఐఏఎస్లు హైకోర్టును ఆశ్రయించారు. డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని.. అధికారులు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించగా.. అక్కడ వారికి చుక్కెదురైంది. డీవోపీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనంటూ క్యాట్ స్పష్టం చేసింది. దీంతో.. క్యాట్ తీర్పును సవాలు చేస్తూ ఐఏఎస్లు బుధవారం (అక్టోబర్ 16న) తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమ్రపాలి కాటా, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, సృజన.. ఈ పిటిషన్ దాఖలు చేశారు.
క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని తెలంగాణలోనే తమను కొనసాగించేలా తీర్పునివ్వాలని హైకోర్టును ఐఏఎస్లు అభ్యర్ధించారు. ఐఏఎస్లు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం రెండున్నకు పిటిషన్ను జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ విచారించనుంది. అయితే.. రిపోర్టు చేసేందుకు ఈరోజే చివరి రోజు కావటంతో.. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. స్టే విధిస్తుందా.. లేదా రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశిస్తుందా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అయితే.. తెలంగాణలో డిప్యూటేషన్ మీద కొనసాగుతున్న పలువురు ఐఏఎస్లు.. తమకు కేటాయించిన ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని ఈ నెల 9న డీవోపీటీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఆదేశాలు రద్దు చేసి.. తమను యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు జారీ చేయాలంటూ క్యాట్లో ఐఏఎస్లు పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఐఏఎస్ల పిటిషన్పై ఘాటుగా స్పందించిన క్యాట్.. కీలక ఆదేశాలు జారీ చేసింది. డీవోపీటీ ఆదేశాల ప్రకారం యధావిధిగా అక్టోబర్ 16న రిపోర్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే.. వారికి సేవ చేయాలని లేదా అంటూ ఐఏఎస్ అధికారులను క్యాట్ ప్రశ్నించింది. ఐఏఎస్ అధికారుల కేటాయింపులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కి అన్ని అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే స్థానికత ఆధారంగా స్వాపింగ్ చేసుకునే వెసలబాటు మార్గదర్శకాల్లో ఉందా అని క్యాట్ ప్రశ్నించినట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే.. సింగిల్ మెన్ కమిటీ సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదని క్యాట్ దృష్టికి పిటిషనర్ల తరఫు న్యాయవాది తీసుకొచ్చారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దుచేయాలని.. ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవాలని క్యాట్ను కోరారు. అయితే దీనికి అంగీకరించని క్యాట్.. డీవోపీటీ ఆదేశాల ప్రకారం రిపోర్టు చేయాల్సిందేనని స్పష్టం చేయటంతో.. ఐఏఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.