byసూర్య | Mon, Sep 30, 2024, 09:10 PM
ప్రస్తుతం పత్తి పంట చేతికందే సీజన్. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పత్తిపంట తీసి మార్కెట్కు తరలిస్తున్నారు. అయితే పత్తి పంట డబ్బుల చెల్లింపుల విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బుల చెల్లింపుల్లో పారదర్శకత కోసం మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తోంది. ప్రభుత్వ సంస్థ అయిన భారత పత్తి సంస్థ(CCI) పత్తి డబ్బులను రైతులకు చెల్లించే క్రమంలో అక్రమాలు చోటు చేసుకోకుండా 'కాటన్ యాలీ' పేరిట యాప్ తీసుకొస్తోంది.
తెలంగాణలో ఈ ఏడాది 43 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. అయితే పత్తి అంట మార్కెట్లు, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మేసిన తర్వాత.. పంట డబ్బులు రైతులకు నేరుగా కాకుండా బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ప్రస్తుతం చెల్లింపులు చేస్తోంది. ఈ విధానంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఓ పోస్టాఫీసు ద్వారా రైతులకు చెల్లించాల్సిన రూ.1.15 కోట్లను పోస్టాఫీసు ఉద్యోగి రైతులకు ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
ఈ నేపథ్యంలో మరోసారి అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా రైతులకు చెల్లింపులు చేసేందుకు గాను మార్కెటింగ్ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. రైతులు సీసీఐకి పంటను విక్రయించిన తర్వాత అన్నదాతలకు చెల్లించే డబ్బులు పోస్టాఫీసులో ఉన్నాయా ? లేక బ్యాంకులో ఉన్నాయా ? ఆ డబ్బును ఎప్పుడు డ్రా చేసుకోవచ్చు ? తదితర విషయాలను ప్రత్యేకంగా రూపొందించిన ఈ 'కాటన్ యాలీ' యాప్ ద్వారా రైతుల స్మార్ట్ఫోన్కు సమాచారం అందించనున్నారు.
ఈ యాప్ ద్వారా రైతులు తమ డబ్బులు సులభంగా డ్రా చేసుకునేందుకు వీలు కలుగుతుందని.. మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. కౌలు రైతులు పత్తిని ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్ముకోవాలంటే కచ్చితంగా భూమి పత్రాలు చూపించాల్సి ఉంటుందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. రైతులు దళారులకు అమ్ముకోకుండా మార్కెట్కు తీసుకొచ్చి విక్రయాలు చేసుకోవాలని సూచించారు.