byసూర్య | Mon, Sep 30, 2024, 04:30 PM
రేవంత్ రెడ్డి గారూ, హైడ్రా పేరుతో కూల్చాల్సిన పరిస్థితి వస్తే మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ కార్యాలయాన్ని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాలాల మీద ఉన్న నిర్మాణాలను కూల్చాలని చెబుతున్నారని, అదే నిజమైతే హైడ్రా కమిషనర్ కూర్చున్న బుద్ధ భవన్ నాలా పైనే ఉందన్నారు. హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న ఈ భవనంలో ఎలక్షన్ కమిషనరేట్, హైడ్రా కమిషనరేట్, మహిళా కమిషనరేట్... ఇలా ఎన్నో ఉన్నాయన్నారు.ఆ తర్వాత నాలా పైన ఉన్న జీహెచ్ఎంసీ ఆఫీసును కూల్చేయాలన్నారు. అన్ని నిర్మాణాలకు అనుమతి ఇచ్చే జీహెచ్ఎంసీ భవనం కూడా నాలా పైనే ఉందన్నారు. అసలు 60 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ చెరువులను ఎందుకు గుర్తించలేదో చెప్పాలన్నారు. ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూల్చుతామని ముందే చెబితే ప్రజలు ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఉండేవారు కాదన్నారు.