రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

byసూర్య | Mon, Sep 30, 2024, 06:45 PM

తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.తెలంగాణలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా కాకుండా, అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నట్లు లేఖలో విమర్శించారు.


మూసి రివర్ ఫ్రంట్, హైడ్రా ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. తమ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న నిరంకుశ పాలనకు బుల్డోజర్ ప్రతీకగా మారిందన్నారు. అది తెలంగాణలో పౌరహక్కులను నిరంతరం ధిక్కరిస్తోందన్నారు. హైడ్రా, మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లుగా అన్ని చట్టపరమైన పత్రాలతో నివసిస్తున్న వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తూ బుల్‌డోజర్ పాలన నడుపుతున్నట్లు పేర్కొన్నారు.


 


బుల్డోజర్ విధానం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వానికి ప్రతిరూపంగా మారిందని లేఖలో ప్రస్తావించారు. అడుగడుగునా చట్టాలను తుంగలో తొక్కుతూ, సహజ న్యాయ సూత్రాలను కాలరాస్తూ తమ పార్టీ ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుందని విమర్శించారు. బుల్డోజర్లు 100 ఏళ్ల క్రితం నుంచి ఇళ్లను, కార్యాలయాలను, రహదారులను ఇతర నిర్మాణాలను నిర్మించడానికి ఉపయోగించేవారని, కానీ ఇప్పుడు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు నిర్మాణాలను కూల్చేందుకు ఉపయోగించడం దుర్మార్గమని మండిపడ్డారు.ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పేదలు, మధ్య తరగతిపై బీజేపీ బుల్డోజర్లను ఎలా ఉపయోగించిందో, కాంగ్రెస్ కూడా తెలంగాణలో అదే విధంగా ఉపయోగిస్తుందన్నారు. ఈ విషయంలో బీజేపీ దారిలోనే కాంగ్రెస్ నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్ కూల్చివేతల మీద సుప్రీం కోర్టు తాజా తీర్పు ఉన్నప్పటికీ, తగిన సర్వేలు నిర్వహించకుండా, సరైన విధానాలను అనుసరించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పేదల ఇండ్లను బుల్డోజ్ చేస్తూ, వారిని కన్నీరు పెట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరచిన సహజ న్యాయ సూత్రాలను, చట్టాలను గౌరవించే విధంగా తమ ముఖ్యమంత్రికి సలహా ఇవ్వమని, తద్వారా రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాహుల్‌ని లేఖలో కోరినట్లు హరీష్ రావు తెలిపారు.


Latest News
 

రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM
సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కాదని.. ఏఈఈ ఉద్యోగాలకు మొగ్గు Mon, Sep 30, 2024, 08:55 PM
రుణమాఫీ కాని అన్నదాతల భారీ శుభవార్త.. 5 లక్షల రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ. Mon, Sep 30, 2024, 08:50 PM
చార్మినార్ కూల్చాలని చెబితే కూల్చేస్తారా..? 'హైడ్రా' కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం Mon, Sep 30, 2024, 08:17 PM