byసూర్య | Sat, Sep 28, 2024, 05:58 PM
పొద్దుపొద్దున్నే నడిరోడ్డుపై ఓ మూట కనిపించింది. ఏంటా మూట అని ఓపెన్ చేసి చూస్తే.. దెబ్బకు మబ్బులిడిపోయాయి. అందులో.. ఓ మహిళ మృతదేహాం కనిపించింది. అది కూడా చెవులు, ముక్కు కోసేసి ఉండటం గమనార్హం. ఈ షాకింగ్ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని.. శ్రీనివాస కాలనీలో జరిగింది. ఉదయాన్నే రోడ్డు మీద ఓ మూట కనిపించటం.. దానికి రక్తపు మరకలు కనిపించటంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ మూటను పరిశీలించారు. మూటను ఓపెన్ చేసి చూస్తే.. అందులో ఓ మహిళ మృతదేహం కనిపించటం తీవ్ర కలకలం రేపింది.
అయితే.. ఆ మూటను విప్పి.. మృతదేహాన్ని బయటికి తీశారు. అయితే.. మహిళ మృతదేహానికి ముక్కు, చెవులు కోసేసి ఉండటం గమనించిన పోలీసులు.. బంగారు ఆభరణాలు చోరీ చేసి.. చంపేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కమ్మలను తీసుకునేందుకే మహిళ చెవులు కత్తిరించినట్టుగా అనుమానిస్తున్నారు. అంతేకాకుండా.. మహిళను ఎక్కడో హత్య చేసి, మూటలో కట్టి అర్థరాత్రి సమయంలో కాలనీలో పడేసి వెళ్లినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో పోలీసులతో పాటు క్లూస్ టీం కూడా ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. మూటలో మహిళ మృతదేహం కనిపించడంతో శ్రీనివాస కాలనీ స్థానికులు తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు.
మరోవైపు నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి సమీపంలోనూ ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. కాళ్లు చేతులు కట్టేసి.. బండరాయితో కొట్టి చంపేసినట్టుగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో.. అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దొంగతనాలు, చైన్ స్నాచింగులు ఎక్కువవుతుండటంతో పాటు.. ఇలాంటి ఘటనలు కూడా వెలుగు చూస్తుండటంతో.. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ దొంగ వచ్చి దాడి చేస్తాడోనన్న భయాందోళనలో జనాలు ఉన్నారు.