byసూర్య | Thu, Jul 25, 2024, 05:01 PM
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా 2.91 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రేవంత్ రెడ్డి సర్కార్.. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేసింది. అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఏకంగా 70 వేల కోట్లు కేటాయించగా.. సంక్షేమానికి 40 వేల కోట్లు కేటాయించింది. ఈ క్రమంలోనే.. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ అభివృద్ధిపై కూడా రేవంత్ సర్కార్.. ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్ నగర ప్రాధాన్యత దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్ద పీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి పౌర సేవలను మరింత సమర్ధవంతంగా అందించడంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహించనున్నాయి. దీంతో.. వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు, హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు, నగరానికి మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించినట్టు తెలిపారు.
ఇవి కాకుండా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కోసం 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టి మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్టు సిస్టమ్ కోసం 50 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం 1,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించినట్టు తెలిపారు.
తెలంగాణకి ఆర్థికంగా ఆయువు పట్టు అయిన హైదరాబాద్ సమగ్రాభివృద్ధి సాధించినప్పుడే పలు రంగాలకు అవసరమైన వనరులు సమకూడి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎన్నడు లేని విధంగా భారీ ఎత్తున 10 వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు.
ఇందులో భాగంగానే.. రీజనల్ రింగు రోడ్డుకు భారీగా కేటాయింపులు చేసింది. బెటర్ రింగ్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ నగరానికి మణిహారం. ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయటంతో హైదరాబాద్ నగరాభివృద్ధి మరింత వేగవంతమైందని.. ఇలాంటి ఫలితాలను రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుతం చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ దోహదపడుతుందని భట్టి పేర్కొన్నారు.
ఉత్తర ప్రాంతంలోని 158.6 కి.మీ. పొడవున్న సంగారెడ్డి- తూప్రాన్- గజ్వేల్- చౌటుప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కి.మీ.ల పొడవున్న చౌటుప్పల్- షాద్ నగర్- సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్ గ్రేడ్ చేయాలని తమ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు.. హైదరాబాదు నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలనూ, తూర్పు పశ్చిమ ప్రాంతాలనూ కలుపుతూ జాతీయ రహదారి నెట్వర్క్తో అనుసంధానం చేస్తుందని తెలిపారు. ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతుంది.
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లేన్లతో నిర్మించి.. దానిని ఎనిమిది లేన్ల సామర్థ్యానికి విస్తరింపజేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్కు ఆర్ఆర్ఆర్కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయని వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్ఆర్ఆర్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి 13,522 కోట్ల రూపాయలు, దక్షిణ ప్రాంతాభివృద్ధికి 12,980 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు.
మరోవైపు.. గత దశాబ్దకాలంగా అపరిష్కృతంగా ఉన్న కంటోన్మెంట్లోని రోడ్ల విస్తరణ, ఎలివేటడ్ కారిడార్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి రక్షణ శాఖ వారితో సంప్రదించి దానికి.. కావల్సిన భూమి బదిలీకి వారి ఆమోదాన్ని కూడా పొందిందని తెలిపారు. ఇది హైదరాబాద్తో పాటు రాష్ట ప్రజలకు ఒక శుభవార్త అని భట్టి తెలిపారు. రోడ్లు మరియు భవనాల శాఖకి ఈ బడ్జెట్లో 5,790 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.