చదువు రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు.. నిరుద్యోగుల గోస అర్థం ఐతలేదు.. సీఎం రేవంత్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్

byసూర్య | Wed, Jul 10, 2024, 07:31 PM

డీఎస్సీ వాయిదా డిమాండ్ వెనుక కుట్ర కోణం దాగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. కొందరు కోచింగ్ సెంటర్ నిర్వహకులు వందల కోట్లు సంపాదించటానికి డీఎస్పీ వాయిదా పేరుతో కృత్రిమ ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించరారు. సీఎం చేసిన ఈ కామెంట్లపై తాజాగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఒక్కో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వంద కోట్లు సంపాదించడానికి వారు చేసేది మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని ట్వీట్ చేశారు. కావాలంటే మీ పంచన చేరిన రియాజ్‌ను అడగాలన్నారు. నిరుద్యోగులను కిరాయి మనుషులనడం మీకే చెల్లిందని రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు. 'అనాడు రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్‌కు తీసుకొచ్చినపుడు మీ వెంబడి వచ్చిన వాళ్లందరూ కిరాయి మనుషులేనా? వచ్చిన 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలిచ్చిండ్రా ? తమరికి ఉద్యోగాల నోటిఫికేషన్‌కు, నియామకాలకు తేడా తెలవక పోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం. పక్కనున్న AP లో 1:50 నుండి 1:100 చేయగలిగినప్పుడు ఇక్కడ TG లో ఎందుకు చేయలేం ? ఇప్పుడు మీరు సిలబస్‌ని పరీక్షా సరళిని మార్చడం లేదు. కేవలం పరీక్షకు అర్హత పొందే అభ్యర్థుల సంఖ్యను మార్చబోతున్నారు. ఈ విషయంలో పరిష్కారానికై అడ్వకేట్‌ జనరల్‌ని అడిగారా?


ఆమరణ దీక్ష చేస్తున్న అశోక్ కుమార్ సార్ ఒక్క రూపాయికే గ్రూప్ 2,3 కోచింగ్ అందిస్తున్నారు. అలాగే గ్రూప్స్ వాయిదా అనంతరం చాలా కోచింగ్ సెంటర్లు రూపాయి ధరకే కోచింగ్ అందించినాయి. పేద విద్యార్థులకు సాయం చేశాయి. .పక్క రాష్ట్ర కోచింగ్ సెంటర్ల మాదిరిగా లక్షలు కడితేనే టెస్టు సిరీస్ ఇస్తాం అనే సంస్కృతి తెలంగాణ బిడ్డలకు లేదు. అందుకే అశోక్ సార్ వెనక వేలాది మంది నిరుద్యోగులు ర్యాలీ ఐతున్నరు.


మీకు నిరుద్యోగుల గోస అర్థం ఐతలేదు. అర్థం చేసుకునే ప్రయత్నమూ చెయ్యడం లేదు. మీ చుట్టూ ఉన్న సోకాల్డ్ మేధావులేమో పదవుల వేటలో ఉన్నరు. నిరుద్యోగులను వాడుకొని పదవుల్లో ఉన్నోళ్లకేమో పోటీ పరీక్షలు రాసిన అనుభవం లేదు. వచ్చిన పదవులను కాపాడుకనీకే వాళ్లు బౌన్సర్లను, బూతులను నమ్ముకున్నరు. ఇక అధికారులేమో తమరిని నిరంతరం ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీగా ఉన్నారు. వాళ్లకు పరిష్కారం తెలవక కాదు, కానీ మీకు పరిష్కారం ఇష్టం లేదు కాబట్టి వాళ్లు మీకు అసలు విషయం చెప్పడం లేదు. కావాలంటే మీరు ఈ రోజు మీ తెలంగాణ సీఎస్‌కు చెప్పి చూడండి, సాయంత్రంకల్లా వాళ్లు మీకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తరు.


మీకేమో ప్రతీదీ రాజకీయ కుట్ర లాగనే కనిపిస్తున్నది. నిరుద్యోగులకు సంఘీభావంగా మాట్లాడిన ప్రతి వ్యక్తిని తలకుమాసినోడని మీరంటున్నరు! మరి మీరు కూడా 2023లో ఇదే పని చేసిండ్రు కదా? మరి మిమ్మల్ని ఏమనాలి?ఆనాడు చిక్కడపల్లికి వచ్చిన రాహుల్ గాంధీని ఏమనాలి ?? అసలు ప్రజాసమస్యలపై మాట్లాడే బాధ్యత ప్రతిపక్షాలకు లేదంటారా ?' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM