byసూర్య | Mon, Jul 08, 2024, 09:48 PM
దేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే (NH-65) ఒకటి. తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఈ హైవే నిలుస్తోంది. ఈ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రద్దీగా ఉండే ఈ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే కొన్ని వందల మంది ఈ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్తే వారి ప్రాణాలు రక్షించే అవకాశం ఉంటుంది. దాన్నే గోల్డెన్ ఆవర్ అని అంటారు. అయితే రహదారికి సమీపంలో అన్ని సౌకర్యాలతో కూడిన ఆసుపత్రులు అందుబాటులో లేకపోటవంతో చాలా మంది ఈ గోల్డోన్ ఆవర్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సత్వరమే చికిత్స అందించేందుకు గాను నేషనల్ హైవేపై ట్రామా కేర్ సెంటర్ను నిర్మించాలని డిసైడ్ అయింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ప్లాజాకు సమీపంలో ఈ సెంటర్ను నిర్మించాలని నిర్ణయించారు. హైదరాబాద్- విజయవాడ పైవేపై ఎక్కడ ప్రమాదం జరిగినా గోల్డెన్ అవర్లోనే వారికి ఎమర్జెన్సీ వైద్యసేవలు అందించేలా ఈ ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. నేడు ఈ ట్రామా కేర్ సెంటర్కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
కాగా, మంత్రి కోమటిరెడ్డి తనయుడు ప్రతీక్ రెడ్డి సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గోల్డెన్ అవర్లో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తే బ్రతికేవాడేనని కోమటిరెడ్డి పలు సందర్భాల్లో వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలో తమ కుంటుంబానికి కలిగిన వేదన మరే కుటుంబానికి కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు గతంలో పలుమార్లు కేంద్రమంత్రి గడ్కరీని కలిసి విన్నవించారు. తాజాగా.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీలో భాగంగా ఏడీపీ కంపెనీ రూ. 5 కోట్ల వ్యయంతో ట్రామా కేర్ సెంటర్ నిర్మించేందుకు ముందుకొచ్చింది.
కోర్లపహాడ్ వద్ద అన్ని సౌకర్యాలతో ఈ హాస్పిటల్ నిర్మించనున్నారు. రెండు అంతుస్తుల్లో నిర్మించనున్న ఈ ట్రామా కేర్ సెంటర్లో 10 బెడ్లు అందుబాటులో ఉంటాయి. ఐసీయూ, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్, వెంటలేటర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడి తీసుకొస్తే అత్యవసర చికిత్స ద్వారా ప్రాణాలు నిలబెట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. కాగా, హైదరాబాద్- విజయవాడ హైవేపై మెుత్తం 17 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అండర్పాస్లు నిర్మించేందుకు సిద్ధమయ్యారు.