byసూర్య | Mon, Jul 08, 2024, 08:21 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాహుల్ ప్రధాని పదవికి కేవలం అడుగు దూరంలో మాత్రమే ఆగిపోయారని చెప్పారు. ఆయన్ను ప్రధాని చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని వైఎస్సాఆర్ అప్పట్లో అనేవారిని.. ఆయన కలను మనం నిజం చేయాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు శ్రమించే వారు మాత్రమే నిజమైన వైఎస్సాఆర్ వారసులను చెప్పారు. మూడు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున తాను తెలంగాణ పీసీసీగా బాధ్యతలు చేపట్టినట్లు సీఎం రేవంత్ గుర్తు చేస్తున్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. అయినా ఏమాత్రం పట్టు వదలకుండా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పని చేసి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు శ్రమించాలని రేవంత్ సూచించారు.
అనంతరం మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఘర్ వాపసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీని వీడిన వారు తిరిగి పార్టీలో చేరాలన్నారు. వారందరికీ పార్టీ తరపున ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పాత నేతలంతా కాంగ్రెస్లో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. భట్టి వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి సమర్థించారు. పార్టీ మారిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సూచించారు.