అసదుద్దీన్ ప్రమాణ స్వీకారంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం.. రికార్డుల నుంచి తొలగింపు

byసూర్య | Tue, Jun 25, 2024, 07:38 PM

ఇటీవల జరిగిన తర్వాత తొలిసారి లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నాయి. 18 వ లోక్‌సభ కొలువుదీరింది. ఈ క్రమంలోనే కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సోమవారం మొదలైన ఎంపీల ప్రమాణ స్వీకారాలు.. మంగళవారం కూడా జరిగాయి. మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వరుసగా కేంద్రమంత్రులు ఎంపీలుగా ప్రమాణం చేశారు. తర్వాత రాష్ట్రాల వారీగా ఇంగ్లీష్ అక్షరాల క్రమంలో వరుసగా ఎంపీలు ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొదటిరోజు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రమాణం చేయగా.. రెండోరోజు తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రమాణం ప్రస్తుతం లోక్‌సభలో తీవ్ర సంచలనం రేపింది.


ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదోసారి ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ.. 18 వ లోక్‌సభలో అడుగు పెట్టి ఉర్దూ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చివర్లో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినాదాలు చేస్తూ ముగించారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 17 వ లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేసిన అసద్.. చివర్లో జై భీమ్, అల్లాహూ అక్బర్ జై హింద్ అంటూ ముగించారు.


అయితే లోక్‌సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా జై పాలస్తీనా అంటూ అసదుద్దీన్ ఓవైసీ నినాదాలు చేయడం పట్ల బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై ప్రొటెం స్పీకర్‌గా ఉన్న భర్తృహరి మహతాబ్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎంపీలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌.. ఆ నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అయితే అంతకుముందు ప్రమాణ స్వీకారం చేసేందుకు అసదుద్దీన్ ఓవైసీ పేరు పిలవగానే సభలోని చాలా మంది సభ్యులు జై శ్రీరామ్, జై భీమ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విటర్ వేదికగా అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాను భారతదేశంలోని అట్టడుగు వర్గాల సమస్యలను చిత్తశుద్ధితో లేవనెత్తుతూనే ఉంటానని పేర్కొన్నారు.


 ఇక లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం తర్వాత చివర్లో జై పాలస్తీనా అనడంపై అసదుద్దీన్ ఒవైసీని పార్లమెంట్ బయట మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. జై పాలస్తీనా అనడం తప్పు కాదా అని అడగ్గా.. తాను చెప్పిన దాంట్లో తప్పేముందని తిరిగి ఆయన ప్రశ్నించారు. జై పాలస్తీనా అంటే వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీశారు. అభ్యంతరం చెప్పేవాళ్ల గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కూడా పాలస్తీనా గురించి ఏం చెప్పారో చదివి తెలుసుకోవాలని ఈ సందర్భంగా అసదుద్దీన్ సూచించారు.



Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM