byసూర్య | Sat, Jun 15, 2024, 08:30 PM
కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. నడిరోడ్డుపై గోడ కట్టేశారు. అబ్బాయి ఇంటికి వెళ్లకుండా రోడ్డుపై గోడ కట్టగా.. గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన రత్నాకర్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. విషయం అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వాళ్లిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.
కాగా, రత్నాకర్ ఇంటికి ఎవరైనా వెళ్లాలంటే అమ్మాయి ఇల్లు దాటి వెళ్లాల్సిందే. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని రగిలిపోతున్న అమ్మాయి తల్లిదండ్రులు రత్నాకర్ ఇంటి వెళ్లే దారిలో నడిరోడ్డుపైనే గోడ కట్టేశారు. అది చూసిన గ్రామస్తులు షాక్కు గురయ్యారు. మీ ఇంటి సమస్యతో రోడ్డుపై గోడ కట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే పోలీసు స్టేషన్కు వెళ్లాలని..అంతే కానీ ఇలా గ్రామస్తులు తిరగకుండా రోడ్డుపై గోడ కట్టడమేంటని నిలదీస్తున్నారు. కాగా, గోడకు సంబంధించిన ఫొటోలో సోషలో మీడియాలో వైరల్గా మారింది.