byసూర్య | Sat, Jun 15, 2024, 08:28 PM
ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 15 లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్కు కేసీఆర్ లేఖ రాశారు. మొత్తం 12 పేజీలతో కూడిన కాపీ ప్రతి కమిషన్కు పంపించారు.
రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో విప్లవాత్మక మార్పులను చేసి చూపించామన్నారు. ప్రజలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందజేశామని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడక ముందు విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అది జగమెరిగిన సత్యమని అది తెలంగాణ బిడ్డగా మీకు కూడా తెలుసునని అన్నారు. కరెంట్ కోతలతో మోటార్లు కాలిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే వారని వివరించారు. ఆ కాలంలో జనరేటర్లు, ఇన్వర్టర్ల కాలమే నడిచిందన్నారు.
ఎంక్వెయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నరసింహారెడ్డికి కేసీఆర్ సూచించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగటం లేదని చెప్పారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా విచారణ జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుబడుతున్నారు. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు.. ఆర్థిక నష్టాన్ని లెక్కించటమే మిగిలి ఉన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. తనను, బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర జరగుతోందని.. విచారణ నుంచి తప్పుకోవాలని జస్టిస్ నరసింహారెడ్డిని కేసీఆర్ కోరారు.