byసూర్య | Sat, Jun 15, 2024, 08:11 PM
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. మాజీ మిస్ వైజాగ్ ఘటన మరవక ముందే హైదరాబాద్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్గా భార్యకు చిక్కాడు. ప్రియురాలు, భర్తను నిలదీయంతో కోపంతో భార్య, కొడుకులపై విచక్షణా రహితంగా దాడికి చేశాడు.
వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ ఎస్ఆర్టి కాలనీకి చెందిన ప్రవీణ్కు భార్య మెర్సీ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, ప్రవీణ్ తన ఆఫీసులోనే పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో కలిసి గత కొన్నాళ్లుగా డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయంలో ఇప్పటికే భార్యాభర్తలపై గొడవలు జరుగుతున్నాయి. అయితే, కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుందాం రమ్మని భార్య మెర్సీని ప్రవీణ్ తాను ప్రియురాలితో ఉంటున్న ఇంటికి పిలిచాడు.
తన ముగ్గురి పిల్లలతో పాటు తల్లిని వెంటబెట్టుకుని ప్రవీణ్ ఉన్న ఇంటికి మెర్సీ వెళ్లారు. అక్కడ ప్రవీణ్, మెర్సీ మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. మెర్సీతో పాటు తన పెద్ద కుమారుడు ప్రవీణ్, అతడి ప్రియురాలిపై చేయి చేసుకున్నారు. దీంతో భార్య, కొడుకుపై ప్రవీణ్ దాడి చేశాడు. తన తండ్రి నుంచి తప్పించుకునేందుకు పెద్ద కుమారుడు కళ్లలో కారం కొట్టాడు. ఈ గొడవ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన మెర్సి.. ఈరోజు మీడియాను, పోలీసులను వెంటబెట్టుకుని భర్త ప్రియురాలితో ఉంటున్న ఇంటికి వెళ్లారు. పోలీసుల ముందే భర్తను, అతడి ప్రియురాలిని వాయించారు.
ప్రవీణ్ ప్రేయసికి గతంలో వివాహం జరిగిందని.. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు గుర్తించారు. ప్రవీణ్తో పాటు అతడి ప్రేయసిని అంబర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. భర్త తనకు కావాలని.. లేకపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని మెర్సీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.