byసూర్య | Sat, Jun 01, 2024, 10:57 AM
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.లారీ – స్కార్పియో ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర ఆందోళనను గురి చేస్తోంది.స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి స్కార్పియో వాహనంలో హైదరాబాద్ వెళ్తున్న సమయంలో సార్కియో కారు ముందుగా వెళ్తున్న లారీని బలంగా ఢీ కొట్టడంతో
ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ తో సహా ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. ఈ కారు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతి చెందిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు బాధితులు వాపోతున్నారు. ఈ విషాద ఘటనతో జాతీయ రహదారిపై తీవ్రంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు అంతా ఆంధ్రప్రదేశ్ లోని ఆళ్ళగడ్డకి చెందినవారిగా గుర్తించారు.