byసూర్య | Tue, May 28, 2024, 08:27 PM
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ అంజలి ఘటించారు. మంగళవారం తెల్లవారుజామునే ఘాట్ దగ్గరకు వచ్చి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీఎం, సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు.
మరోవైపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత బక్కని నర్సింహులు, ఇతర నేతలు, అభిమానులు అంజలి ఘటించారు. ఎన్టీఆర్ తెలుగువారిక ఆరాధ్య దైవం.. ఒక శక్తి అన్నారు బాలకృష్ణ. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి.. చదువుకుని ఉద్యోగం చేసిన తర్వాత సినిమాల్లోకి వచ్చారన్నారు. నందమూరి తారకరామారావు అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయమని కితాబిచ్చారు. సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
ఎన్టీఆర్ ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి.. ఎంతోమందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది డాక్టర్లు, లాయర్లు, అభిమానులను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత దక్కిందన్నారు. ఎన్టీఆర్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీనవర్గాలకు పదవులు కట్టబెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు.