byసూర్య | Tue, May 28, 2024, 11:37 AM
జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిట లాడింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు సోమవారం రాత్రి నుంచి అంజన్న దర్శనానికి వస్తున్నారు.భారీగా తరలివస్తున్న అంజన్న భక్తులతో ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది. మంగళవారం ఉదయం 4:30 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దర్శనానికి 2 గంటలకుపైగానే సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.మామూలుగా ప్రతి మంగళ, శనివారాలు రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ నెల 30 నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాల ప్రారంభం ఉండడం, వేసవి సెలవులు కూడా ముగుస్తున్నడంతో భక్తులు అంజన్న దర్శనానికి పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను కొబ్బరికాయల టెండర్ దారులు ఒక్కో కొబ్బరికాయ రూ.40 రూపాయలకు విక్రయస్తూ నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. తలనీనాలు సమర్పించే కళ్యాణ కట్ట దగ్గర సైతం వంద రూపాయలు ఇస్తేనే గుండు తీస్తామని ఓ భక్తుడిని డిమాండ్ చేయడంతో అది కాస్త వివాదంగా మారింది. టికెట్ కొనుగోలు చేసినప్పటికీ డబ్బు ఎందుకు ఇవ్వాలని సదరు భక్తుడు అక్కడ ఉన్న వారిని నిలదీశాడు.