byసూర్య | Mon, May 27, 2024, 07:36 PM
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. మెుత్తం 12 జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. అయితే.. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లిలో పోలింగ్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓపార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్పై దాడి జరిగినట్లు తెలిసింది.
నార్కెట్పల్లిలోని డోకూరు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తరపున డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అశోక్ అక్కడకు చేరుకున్నారు. డబ్బులు పంచటాన్ని అడ్డుకున్నందుకు ఆయనపై దాడి చేసినట్లు తెలిసింది. వీడియో రికార్డు చేస్తున్న మీడియా సిబ్బందిపైనా దాడి చేసి కెమెరాలు, ఫోన్లు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఓడిపోతున్నామనే భయంతోనే తనపై దాడి చేసినట్లు అశోక్ ఆరోపించారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని.. ఆయన నార్కట్పల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రలోభాలను అడ్డుకోవటంలో పోలీసులు, ఎన్నికల అధికారులు విఫలమయ్యారన్నారు. ప్రజాస్వామ్యవాదులు దీనిని ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక మిగతా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తుర్కపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన సతీమణి మమతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటేశారు. హనుమకొండ పింగిలి మహిళా కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.