byసూర్య | Mon, May 27, 2024, 07:39 PM
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్లోని నివాసంలో ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి సొంతూరు ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు. టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సీతాదేవి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త నాగేంద్రనాథ్ (చిట్టి) ఏపీ రైతాంగ సమాఖ్య, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. గతేడాది ఆయన కన్నుమూశారు. నాగేంద్రనాథ్-సీతాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్ కైకలూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయంసాధించారు. ఇక సీతాదేవి 2013లో బీజేపీలో చేరారు. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.