byసూర్య | Mon, May 27, 2024, 07:26 PM
తెలంగాణలో బీర్ల కొరత ఏర్పడినట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకు వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనిమిస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ల బీర్లు దొరక్క మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యపై పలువురు మందుబాబులు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాలు సైతం ఇచ్చారు. వైన్ షాపుల్లో బీర్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త బీర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా.. రాష్ట్రంలోకి రాబోతున్న కొత్త బ్రాండ్ బీర్లు ఇవేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్లను సరఫరా చేయడానికి సోమ్ డిస్టిలరీస్ అనుమతి పొందిందని కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం కింగ్ ఫిషర్, ఆర్సీ, 5000 వంటి బీర్లు అందుబాటులో ఉండగా.. కొత్త బీర్ల కంపెనీ పవర్ 1000, హంటర్, బ్లాక్ ఫోర్ట్, వుడ్ పీకర్ వంటి పేర్లతో కొత్త బీర్లు అందుబాటులోకి తీసుకువస్తుందని ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, కొత్త బ్రాండ్ బీర్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల కీలక కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని.. తాము పరిశీలించలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్ పెట్టిందని.. పెండింగ్ బిల్లుల వల్లే కంపెనీలు ఎక్కడైనా బీర్లు సప్లయ్ చేయకపోయి ఉండవచ్చు తప్ప మద్యం కృత్రిమ కొరత లేదన్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీరు బ్రాండ్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.