byసూర్య | Mon, May 27, 2024, 07:19 PM
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు యువతి.. అర్థాంతరంగా తనువు చాలించింది. పైచదువులు, మంచి ఉద్యోగాలు అంటూ విదేశాలకు వెళ్తున్న తెలుగు యువతలో కొంతమంది.. అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ కన్నవారికి వేదనను మిగుల్చుతున్నారు. తాజాగా.. యాదాద్రి జిల్లాకు చెందిన గుంటిపల్లి సౌమ్య అనే యువతి రోడ్డు ప్రమాదంలో గాయపడి కన్నుమూసింది. అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన సౌమ్య ప్రాణాలు కోల్పోయింది.
యాదగిరిపల్లికి చెందిన కోటేశ్వరరావు సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం కిరాణాషాపు నడుపుతూ కూతురు, కొడుకును చదివిస్తున్నారు. అయితే కోటేశ్వరరావు కూతురు సౌమ్య చిన్నప్పటి నుంచి చదువులో మెరికలా ఉండేది. దీంతో ఎమ్ఎస్ చేసేందుకు సౌమ్యను అమెరికాకు పంపించారు. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ సీటు దక్కించుకున్న సౌమ్య.. అక్కడే పనిచేస్తూ ఎమ్ఎస్ పూర్తిచేశారు. ఇటీవలే ఎమ్ఎస్ పూర్తికావటంతో ఉద్యోగవేటలో ఉన్నారు. అయితే ఆదివారం అనూహ్య రీతిలో సౌమ్య ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఆదివారం కూరగాయల కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సౌమ్యను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సౌమ్య అక్కడికక్కడే చనిపోయింది. కూతురి మరణవార్త తెలిసి ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సౌమ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. మే 11వ తేదీ సౌమ్య పుట్టినరోజు జరుపుకుందని.. కొత్తబట్టలు కూడా ఇండియా నుంచి పంపామంటూ కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. ఇంతలోనే ఇలాంటి దుర్వార్తను వినాల్సి వస్తుందని అనుకోలేదంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ సౌమ్య తల్లిదండ్రుల రోదన స్థానికులను కలిచివేస్తోంది.