byసూర్య | Sun, May 26, 2024, 08:58 PM
చెప్పిన సమయామనికి డబ్బులు ఇవ్వకపోతే.. ఇంట్లోని సామాన్లన్ని రోడ్డు మీదుంటాయి. నీ పెళ్లాం నాతో ఉంటుంది.. అంటూ సినిమాల్లో విలన్లు వార్నింగులు ఇస్తుంటారు. ఒకవేళ నిజంగానే డబ్బులు ఇవ్వకపోతే.. సదరు వ్యక్తి భార్యను ఎత్తుకెళ్లిపోతుంటారు. ఇలాంటి సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ.. ఇప్పుడు అచ్చంగా ఈ సీన్ను చేసి చూపించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహితను కిడ్నాప్ చేయటం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. అయితే.. ఈ కిడ్నాప్ గురించి దర్యాప్తు చేస్తుంటే.. అసలు ఈ పైసా వసూల్ వెనుక ఉన్న మరో స్టోరీ బయటపడింది.
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగి నుంచి లక్షల రూపాయలు నొక్కేసి ఏళ్ల తరబడి ముఖం చాటేశాడు. ఎన్ని రోజులు ఎదురు చూసినా.. ఉద్యోగం ఇప్పించకపోవటంతో.. ఇచ్చిన డబ్బులైనా తిరిగి ఇచ్చేయాలంటూ ఆ నిరుద్యోగి డిమాండ్ చేశాడు. అయితే.. రేపు, మాపు అంటూ తిప్పిస్తుండటంతో విసిగిపోయిన బాధితుడు ఇక లాభం లేదని మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏకంగా.. తనను మోసం చేసిన వ్యక్తి భార్యను ఎత్తుకెళ్లాడు. పైగా తీసుకొన్న డబ్బులు ఇస్తేనే భార్యను వదులుతానని హెచ్చరించాడు. దీంతో లబోదిబో మంటూ సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన మాగంటి లక్ష్మణరావుతో హైదరాబాద్కు చెందిన ఎలిజబెత్రాణికి 19 ఏళ్ల క్రితం వివాహమైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుందర్నగర్లో ఈ జంట నివాసముంటున్నారు. వీళ్లకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎలిజబెత్రాణి స్థానిక ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో స్టాఫ్నర్స్గా పనిచేస్తుంది. అయితే ఆమె భర్త లక్ష్మణరావు ఏడేళ్ల క్రితం ఓయూ ప్రాంతంలోని మాణికేశ్వర్నగర్కు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 4 లక్షలు తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత లక్ష్మణరావు దందా బయటపడటంతోపై అధికారులు అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించారు.
ఈ విషయం తెలుకున్న వెంకటేశ్ తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చెయ్యాలంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎంతకూ ఇవ్వకపోవటంతో.. మరో ఇద్దరు మహిళల సాయంతో శనివారం ఉదయం ఎలిజబెత్రాణిని ఆటోలో ఎక్కించుకుని మాణికేశ్వర్నగర్లోని తన ఇంటికి తీసుకెళ్లారు. తాను కిడ్నాపైన విషయం ఎలిజబెత్రాణి తన కుమారుని ఫోన్ చేసి చెప్పటంతో.. లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శనివారం సాయంత్రానికి వెంకటేశ్ ఇంటికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని, నిందితుడిని పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. ఇచ్చిన సొమ్మును రాబట్టాలంటే.. చట్ట ప్రకారం వెళ్లాలని ఇలా బలవంతంగా దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు యత్నించారు.