byసూర్య | Sun, May 26, 2024, 07:50 PM
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాజస్థాన్ నుంచి రాష్ట్రం మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించిన ఉపరితల ద్రోణి కారణంగా ఇవాళ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కి.మీ వేగంతో ఉత్తరదిశగా కదులుతున్నట్లు వెల్లడించారు.
దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ఉమ్మడి మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం,వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో కూడిన వాన పడుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేశారు.
అదే సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు. నిర్మల్ జిల్లాలో శనివారం భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. కుభీర్ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముజిగిలో 45.2 డిగ్రీలు, తానూరు మండల కేంద్రంలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. శనివారం కుమురం భీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.