రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 15 వేలు, మంత్రి కీలక అప్డేట్

byసూర్య | Sun, May 26, 2024, 07:41 PM

తెలంగాణలోని రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ. 15 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా కూడా ఒకటి. అయితే ప్రస్తుతం గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు ఎకరానికి రూ. 10 వేలు ( ఖరీఫ్, రబీ సీజన్లు రెండు విడతల్లో) మాత్రమే జమ చేశారు. 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతుబంధు సాయం అందగా.. మిగిలిన రైతులకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.


 కాగా, రైతు భరోసా కింద ఇచ్చే రూ. 15 వేల సాయంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కీలక అప్డేట్ ఇచ్చారు. రానున్న వానాకాలం సీజన్‌ నుంచి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. పంట వేసుకున్న రైతులకే దీనిని ఇస్తామని చెప్పారు. జూన్‌లో ఎన్నికల కోడ్‌ ముగియగానే.. రైతుభరోసాపై అఖిలపక్షంతో పాటు రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. శాసనసభలో, మంత్రిమండలిలో దీనిపై చర్చించి పథకం అమలు చేస్తామని చెప్పారు. కౌలుదార్లు సాగు చేస్తే వారికే నిధులిస్తామన్నారు. భూములను కౌలుకు తీసుకునే సమయంలో రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకున్న కౌలుదార్లకే రైతుభరోసా సొమ్ము చెల్లిస్తామన్నారు.


గత ప్రభుత్వం రూ.లక్ష మాఫీయే సరిగా చేయలేదని తుమ్మల విమర్శించారు. తాము రూ.2 లక్షల రైతు రుణ మాఫీ కచ్చితంగా అమలు చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. ఒకే దఫా మొత్తం రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షలలోపు పంట రుణాలపై వాస్తవ గణాంకాలు ఇవ్వాలని బ్యాంకులను ఇప్పటికే ఆదేశించామన్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిశాక కటాఫ్‌ తేదీపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తుమ్మల వెల్లడించారు.


అకాల వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో పాటు కరవు వల్ల పంటలు నష్టపోయిన వారిని ఆదుకునేలా పంటల బీమా పథకం ఉంటుందని తుమ్మల చెప్పారు. పంట దిగుబడులు తగ్గినా, పంట వేయలేని పరిస్థితులున్నా సాయం అందాలన్నారు. ఈపథకానికి రూ.3500 కోట్ల మేర ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యామని తెలిపారు. బీమా కంపెనీల కోసం కాకుండా రైతులకు మేలు జరిగేలా విధివిధానాలు ఉంటాయని తుమ్మల వెల్లడించారు.


Latest News
 

బస్సు సౌకర్యం కావాలని మంత్రికి వినతి Tue, Oct 22, 2024, 02:39 PM
విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి Tue, Oct 22, 2024, 02:00 PM
రైలులో సెర్వ్ చేసిన రైతాలో జెర్రి Tue, Oct 22, 2024, 01:57 PM
కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ Tue, Oct 22, 2024, 01:00 PM
నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు Tue, Oct 22, 2024, 12:57 PM