byసూర్య | Sun, May 26, 2024, 07:37 PM
తెలంగాణలోని బీడీ కార్మికులకు గుడ్న్యూస్. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ప్యాకర్ల వేతనాలు పెరగనున్నాయి. పెంపుపై కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలకు మధ్య శనివారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చలతో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న దాదాపు 7 లక్షల మందికి ప్రయోజనం జరగనుంది. కొత్తగా చేసిన వేతన పెంపు 2024 మే 1 నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉండేలా ఒప్పందం కుదిరింది.
బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్లు, నెలవారీ వేతన ఉద్యోగులతో గతంలో చేసుకున్న వేతన ఒప్పందం 2024 ఏప్రిల్ 30 తేదీతో ముగిసింది. కొత్త వేతనాల అమలు కోసం కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాల మధ్య శనివారం చర్చలు జరిగాయి. బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో 95 శాతానికిపైగా బీడీలు చుట్టే కార్మికులే ఉంటారు. ప్రస్తుతం 1000 బీడీలు చుడితే వారికి రూ.245.08 వేతనంగా అందుతోంది. తాజాగా జరిగిన చర్చల్లో అదనంగా రూ.4.25 పెంచేందుకు బీడీ పరిశ్రమ యాజమాన్యాలు అంగీకరించాయి. పెరిగిన మొత్తానికి పండగ, సెలవులు, బోనస్ అన్నీ కలిపితే ప్రతి 1000 బీడీలకు వేతనం రూ.249.99కి చేరునుంది.
బీడీ ప్యాకర్లు ప్రస్తుతం పొందుతున్న వేతనాలపై నెలకు అదనంగా రూ.3,650 ఇవ్వనున్నారు. అలాగే నెలవారీ వేతన ఉద్యోగులైన బట్టీవాలా, చెన్నీవాలా, బీడీసార్టర్లు తదితరులకు ప్రస్తుత నెలవారీ వేతనాలపై అదనంగా రూ.1,700 పెంచేలా ఈ చర్చల్లో నిర్ణయం తీసుకున్నాయి. ఈ వేతన ఒప్పందం 2026 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనుంది.