byసూర్య | Sat, May 25, 2024, 09:38 PM
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను పీడిస్తోందని అన్నారు. తెలంగాణలో కొత్తగా బీఆర్ యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి (బీఆర్ యూ) పేర్లతో ఈ టాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సన్నాహాక సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ట్యాక్స్తో తెలంగాణ ప్రజలపై భారం పడిందని అన్నారు.
ముఖ్యమంత్రి సహా కేబినెట్ మంత్రులందరూ అనధికారికంగా విడివిడిగా పన్నులు వసూలు చేస్తూ తమ ఢిల్లీ బాసుల జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మారని.. ఆరు నెలల్లోనే వారి నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. నీరు, కరెంట్ వంటి కనీస వసతులు ప్రజలు దూరమవుతుండగా.. వివిధ రంగాల నుంచి అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయని ఆరోపిచారు. శాంతియుత తెలంగాణలో ఫ్యాక్షన్ హత్యలు మొదలయ్యాయన్నారు. గతంలో ఇలాంటి రాజకీయ హత్యల సంస్కృతి లేదని చెప్పారు.
నిరుద్యోగుల పక్షాన తాము పోరాటం చేస్తామని.. సూపర్న్యూమరీ పోస్టులను సృష్టించటంతో పాటు ఖాళీలను భర్తీ చేయడానికి చట్టసభల్లో రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతామని అన్నారు. మే 27న జరిగే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని మెుదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన పట్టభద్రులను కోరారు.