byసూర్య | Wed, May 22, 2024, 08:09 PM
తెలంగాణలోని నేతన్నలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్న్యూస్ చెప్పారు. వారి సమస్యల పరిష్కారానికి తాను ప్రతిపాదించిన విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణ కొరకు 2024 -25 ఏడాదికి బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా కేటాయింపబడిన రూ.400 కోట్ల బడ్జెట్ వినియోగించుకునేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు తెలిపారు. కనుముక్కల పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ స్థలంలో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నందు డిప్లొమా, డిగ్రీ ప్రోగ్రాంలలో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు.
టీఎస్సీఓ ద్వారా సానిటరీ నాప్కిన్లు ఉత్పతి పరిశ్రమను పోచంపల్లిలో ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారన్నారు. స్కూళ్లకు వెళ్లే బాలికలకు ఋతుక్రమ సమయంలో పరిశుభ్రత పాటించడానికి, బడికి గైర్హాజరును తగ్గించటానికి సానిటరీ నాప్కిన్లు స్వయం సహాయక సంఘాల ద్వారా సరఫరా చేయుటకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల నుంచి టీఎస్సీఓకి రావాలసిన పెండింగ్ బాకాయిలను విడుదల చేసేందుకు సీఎం అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు. బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా కేటాయింపబడిన రూ.400 కోట్లు ఖర్చు చేసి చేనేతల అభివృద్ధికి పాటుపడతామన్నారు.