![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 08:33 PM
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఊహించటం ఎవరితరం కాదు. అప్పటి వరకు సరదాగా.. ఆనదంగా గడిపిన వారు కూడా ఉన్నట్లుండి కూప్పకూలుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అనేకం. కారణాలు ఏవైనా అకాల మృత్యువులతో అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంటుంది. ఇలాంటి ఘటనే సికింద్రాబాద్ బొల్లారంలో చోటు చేసుకుంది. బైక్పై భార్యతో కలిసి వెళ్తున్న వ్యక్తిని చెట్టు రూపంలో మృత్యువు కబళించింది.
వివరాల్లోకి వెళితే.. బొల్లారం ప్రాంతానికి చెందిన రవీందర్-సరళా దేవి దంపతులు. సరళాదేవి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె ఒంట్లో బాగోలేకపోవటంతో భర్త రవీందర్ బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రికి స్కూటీపై బయల్దేరారు. ఆసుపత్రిలో గేటు దాటి లోపలికి వెళ్లగానే.. పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం ఆకస్మాత్తుగా కూప్పకూలింది. వీరు ప్రయాణిస్తున్న స్కూటిపై వచ్చి పడింది. ఈ ఘటనలో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
స్కూటీ వెనుక కూర్చున్న సరళదేవికి తీవ్ర గాయాలయ్యాయి. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదాన్ని గ్రహించిన ఆసుపత్రి సిబ్బంది.. తోటి పేషెంట్లు వెంటనే చెట్టును పక్కకు తప్పించి వారిని బయటకు తీశారు. తీవ్ర గాయాలపాలైన సరళాదేవిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఓ రెండు మూడు సెకన్ల ముందు వచ్చినా.. లేటుగా వచ్చినా వారి ప్రాణాలు దక్కేవి అని ఆ దృశ్యాలు చూసిన వారు అంటున్నారు. అయితే అతనికి ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయాయని.. మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఊహించలేం అనడానికి ఇదే సరైన ఉదాహరణ అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెుత్తానికి చెట్టు కారణంగా ఓ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.