byసూర్య | Tue, May 21, 2024, 07:50 PM
తెలంగాణలో గతకొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైంది. ధాన్యం అమ్మేందుకు మార్కెట్లకు తీసుకొచ్చినా.. సరైన సౌకర్యాలు లేకపోవటంతో వర్షానికి తడిసి మెులకెత్తుతున్నాయి. దీంతో అన్నదాతలు పరేషాన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుడ్న్యూస్ చెప్పారు. తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని చెప్పారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని.. వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు రైతులకు అందించాలని సూచించారు.
అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వారిని ఆదుకుంటామని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి సీరియస్ అయ్యారు. ఇది సరైన విధానం కాదని అన్నారు. అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని భట్టి ఎద్దేవా చేశారు. 15 రోజుల ముందుగానే ధాన్యం కొంటున్నామని ఆ సందర్భంగా ఆయన వెల్లడించారు. గతంలో కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం కంటే ఎక్కువగా తాము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదని భట్టి విమర్శించారు. తమ ప్రభుత్వంలో తడిచిన, మొలకెత్తిన ధాన్యానికి కూడా ఎంఎస్పీ ఇచ్చి కొంటామని అన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. ధాన్యం రైతులకు మూడు రోజుల్లోనే డబ్బు అందిస్తున్నామని.. రైతులందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు.