నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి గురించి తెల్సుకోవాల్సిన విషయాలు

byసూర్య | Thu, May 09, 2024, 02:47 PM

కెనడాలో ఉన్నత చదువులు చదివి అక్కడే ఉద్యోగంలో చేరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులై కెనడాలో టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా సంఘాన్ని ఏర్పాటు చేసి పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత స్వస్థలం సూర్యాపేటకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. ఆయనే శానంపూడి సైదిరెడ్డి. రాజకీయాల్లో ప్రవేశించిన అనతి కాలంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు.రాజకీయాల్లో ప్రవేశించిన అనతికాలంలోనే చట్ట సభల్లో అడుగుపెట్టిన అతికొద్ది మంది నాయకుల్లో శానంపూడి సైడి రెడ్డి ఒకరు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో 1974 ఏప్రిల్‌ 18న అంకిరెడ్డి, సత్యవతి దంపతులకు సైదిరెడ్డి జన్మించారు. మఠంపల్లిలోని వీవీఎం హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివారు.
ఇంటర్ హుజూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, డిగ్రీ ప్రియదర్శిని కళాశాలలో పూర్తి చేశారు. సైదిరెడ్డి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగంలో చేరారు. 2009లో తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితుడై.. కెనడాలో తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ ఏర్పాటు చేసి, ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి గతంలో గుండ్లపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. అలా ఆ కుటుంబానికి కొంత రాజకీయ నేపథ్యం ఉంది. ఆ తర్వాత సైదిరెడ్డి తెలుగుదేశం పార్టీలో మఠంపల్లి మండలం ప్రధాన నాయకుడిగా కొనసాగారు. విదేశాల్లో ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడిన సైదిరెడ్డి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్వరాష్ట్రానికి తిరిగొచ్చారు. తన తండ్రి పేరుతో అంకిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలా నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు.


2018లో అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) అభ్యర్థిగా బరిలోకి దిగారు శానంపూడి సైదిరెడ్డి. ఆ ఎన్నికల్లో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను కాదని.. సైదిరెడ్డికి కేసీఆర్ టికెట్ కేటాయించడం అప్పట్లో ఓ సంచలనం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాటి టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. తొలి ఎన్నికల్లోనే సైదిరెడ్డికి ఓటమి ఎదురైంది. ఉత్తమ్ చేతిలో 7,466 ఓట్ల తేడాతో సైదిరెడ్డి ఓడిపోయారు. ఆ ఎన్నికలో మొత్తం 1,94,493 ఓట్లు పోలవగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి 92,996 ఓట్లు, సైదిరెడ్డికి 85,530 ఓట్లు పోలయ్యాయి. 2019లో అనూహ్యంగా మరోసారి పోటీ చేసే అవకాశం సైదిరెడ్డికి వచ్చింది. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సైదిరెడ్డి మరోసారి బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేశారు. సైదిరెడ్డికి 1,13,094 ఓట్లు (56.34 శాతం) రాగా.


కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డికి 69,736 ఓట్లు (34.74 శాతం) మాత్రమే వచ్చాయి. సైదిరెడ్డి 43,359 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో 44,888 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం అనూహ్యంగా 2024 మార్చి 10న ఢిల్లీలో బీజేపీ కీలక నేతల సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.కాట్రం రజితను శానంపూడి సైది రెడ్డి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అంకిరెడ్డి, అనిరుధ్ రెడ్డి ఉన్నారు. తన పెద్ద కుమారుడికి తండ్రి అంకిరెడ్డి పేరు పెట్టారు సైదిరెడ్డి.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM