byసూర్య | Sun, Apr 14, 2024, 09:32 PM
హైదరాబాద్ అంటే చార్మినార్, ఇరానీ ఛాయ్, ధమ్ బిర్యానీతో పాటు.. ట్రాఫిక్ సమస్యలు కూడా గుర్తుకొస్తుంటాయి. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా.. ఇంకెన్ని అండర్ పాస్లు నిర్మించినా.. మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్లు పరుగులు పెట్టినా.. నగరంలో మాత్రం ట్రాఫిక్ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకట్లేదు. కాగా.. ఈ ట్రాఫిక్ ఇబ్బందులను వీలైనంతగా తగ్గించేందుకు ప్రభుత్వాలు తమవంతు ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. పలు మార్గాల్లో కొత్తగా ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టారు. కాగా.. ఈ నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో కానీ.. ఇప్పుడు మాత్రం వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
అసలే ఎండా కాలం.. పైనుంచి భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ సమయంలో ట్రాఫిక్ జామ్ అయితే పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోండి. అదే పరిస్థితి ఎదురవుతోంది హైదరాబాద్- బెంగళూరు రహదారిపై ప్రయాణించే వాహనదారులకు. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో.. రహదారులు ఇరుకుగా మారాయి. అది హైవే కావటం వల్ల పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు జరుపుతుండటంతో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. మండుటెండలో మాడిపోతున్నారు వాహనదారులు.
సుమారు ఆరు నెలలుగా నిర్మాణ పనులు స్లో మోషన్లో సాగుతుండటంతో.. అప్పటి నుంచి వాహనదారులకు తిప్పలు తప్పటం లేదు. అయితే.. ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండటంతో ద్విచక్రవాహనదారుల మాడులు పగిలిపోతున్నాయి. కాగా.. ఈ రోడ్డుపై ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా.. ఇక అంతే. అచ్చంగా అదే జరిగింది. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు ఓ వాహనం బోల్తాపడటంతో.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి గండిగూడ, చెర్లగూడ వరకు వాహనాలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఎండలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని.. లేదా ప్రత్యామ్నాయ మార్గాలైన ఏర్పాటు చేశాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.